మన్యంలో ముసురు

ABN , First Publish Date - 2022-11-03T00:22:14+05:30 IST

మన్యంలో బుధవారం ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల భారీ నుంచి ఒక మోస్తరు వర్షం కురవగా, పలు ప్రాంతాల్లో మబ్బుల వాతావరణం కొనసాగుతున్నది.

మన్యంలో ముసురు
ముంచంగిపుట్టులో వర్షం

పలు చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షం

పాడేరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల భారీ నుంచి ఒక మోస్తరు వర్షం కురవగా, పలు ప్రాంతాల్లో మబ్బుల వాతావరణం కొనసాగుతున్నది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఏజెన్సీలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. ఆ తరువవాదదత ఎండ కాసింది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత నుంచి ఆకాశం మేఘావృతమై మబ్బుల వాతావరణం కొనసాగింది. ఒడిశా రాష్ట్రాన్ని అనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. పాడేరు మొదలుకుని జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, మండలాల్లో ఆకాశం మేఘావృతమై ముసురు నెలకొంది.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనభసింగి సమీపంలో చింతచెట్టు కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడడం వల్ల సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి విద్యుత్‌ తీగలపై పడిన కొమ్మలను తొలగించి రాత్రి ఎనిమిది గంటల సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఏకధాటిగా సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి స్థానిక ప్రధాన రహదారితో పాటు పలు గ్రామాలకు వెళ్లే రహదారులు చిత్తడిగా మారాయి.

హుకుంపేటలో..

హుకుంపేట: మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు చిత్తడిగా మారాయి. అరకులోయ ప్రధాన రహదారి బురదమయంగా మారడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-11-03T00:22:18+05:30 IST