రుణాలు తీసుకోకుండా నోటీసులు
ABN , First Publish Date - 2022-11-12T01:21:46+05:30 IST
తాము రుణాలు తీసుకోకుండానే బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయని వైబీపట్నం గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లాకలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం గన్నవరం సొసైటీలో ఎలమంచిలి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి. శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు.
నాతవరం, నవంబరు 11: తాము రుణాలు తీసుకోకుండానే బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయని వైబీపట్నం గ్రామానికి చెందిన కొందరు రైతులు జిల్లాకలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం గన్నవరం సొసైటీలో ఎలమంచిలి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి. శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత పాలకవర్గ సమయంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోయినా రుణాలు తీసుకున్నారని, వడ్డీతో సహా రుణాలు చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో వైబీపట్నంకి చెందిన కొందరు రైతులు కంగుతిన్నారు. తమకు భూములు లేవని, తామెలా రుణాలు తీసుకుంటామని వారు జిల్లాకలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు శుక్రవారం ఎలమంచిలి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి.శ్రీనివాసరావు గన్నవరం సొసైటీలో విచారణ నిర్వహించారు. అసలు తమకు భూమే లేదని, రుణాలు ఎలా ఇస్తారని రైతులు విచారణ అధికారి డి. శ్రీనివాసరావును ప్రశ్నించారు. గత పాలకవర్గంలో రైతుల సంతకాలు లేకుండా రుణాలు ఇచ్చారా? లేదా అన్నది రికార్డులు పరిశీలించవలసి ఉందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామన్నారు. రైతుల సంతకాలు లేకుండా రుణాలు ఇస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని విచారణ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పాలకవర్గ గన్నవరం సొసైటీ పర్సన్ఇన్చార్జ్ గొర్లి వరహాలబాబు పాల్గొన్నారు.