Nadendla Manohar: వారాహి గురించే మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
ABN , First Publish Date - 2022-12-09T10:24:50+05:30 IST
వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
విశాఖపట్నం: వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ((Janasena PAC Chairman Nadendla Manohar) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన పార్టీ చట్టానికి ఉల్లంఘనగా ఏ పనీ చేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మార్చి కోర్టులో మొట్టికాయలు తిన్నారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బిసి గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేశారని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ కాదు వైఎస్ఆర్టీసీ గా మార్చేశారని వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు పోరడుతోంటే చెక్ పవర్లు లాగేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల కబ్జాల గురించి సర్వే నెంబర్లతో సహా బాధితులు జనవాణిలో పాల్గొనేందుకు వచ్చారని జనసేన నేత తెలిపారు.
జనవరి 12న యువతకు భరోసా ఇస్తూ రణస్ధలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎన్జీఓలందరినీ ఒక వేదికపైకి తీసుకువస్తామన్నారు. అధికారంలోకి వచ్చే మొదటి ఏడాది నుంచి యువతలో భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. చక్కటి వాతావరణంలో వారి గ్రామాల్లోనే నివసించే విధంగా ఉపాధి పొందుతామనే భరోసా ఇస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.