సాంకేతికతతో భారత్ పురోభివృద్ధి
ABN , First Publish Date - 2022-11-23T03:42:14+05:30 IST
సాంకేతికతను సద్వినియోగం చేసుకుని, దేశం పురోభివృద్ధి చెందుతోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నా రు.
టెక్నాలజీని యువత సద్వినియోగం చేసుకోవాలి: ఇస్రో చైర్మన్
ఘనంగా శ్రీసత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
పుట్టపర్తి, నవంబరు 22: సాంకేతికతను సద్వినియోగం చేసుకుని, దేశం పురోభివృద్ధి చెందుతోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నా రు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సోమనాథ్.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.భారత్ నేడు సొంతంగా రాకెట్లు, మిసైల్స్ను విజయవంతంగా ప్రయోగిస్తోందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అమోఘమైన ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థీ సమాజ హితమే లక్ష్యంగా ఆర్జించిన విద్యను దేశ ప్రగతి కోసం వినియోగించాలన్నారు. విద్యార్థులు మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీతోపాటు విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని సోమనాథ్ తెలిపారు. అనంతరం యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి.. విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీలను ప్రదానం చేశారు.