గుమ్మ.. సొంత గూడు లేదమ్మ!
ABN , First Publish Date - 2022-10-04T06:53:42+05:30 IST
పేరుకు పంచాయతీ కేంద్రం.. కానీ ప్రభుత్వ కార్యాల యాలకు సొంత భవనాలు లేని దయనీయ స్థితిలో ఉంది. ఓ పక్క ప్రాధాన్యత భవనాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్ర భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలు లేని గుమ్మ పంచాయతీలో మాత్రం వాటి నిర్మాణాలు పునాదుల దశలోనే ఏళ్ల తరబడి ఉండిపోయాయి.
- ప్రభుత్వ కార్యాలయాలకు నీడ కరువు
- ఒకే ఒక్క శిథిల భవనంలో సచివాలయం, అంగన్వాడీ కేంద్రం
- పునాదుల దశలోనే ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు
- ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు
అనంతగిరి, అక్టోబరు 2: పేరుకు పంచాయతీ కేంద్రం.. కానీ ప్రభుత్వ కార్యాల యాలకు సొంత భవనాలు లేని దయనీయ స్థితిలో ఉంది. ఓ పక్క ప్రాధాన్యత భవనాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్ర భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ భవనాలు లేని గుమ్మ పంచాయతీలో మాత్రం వాటి నిర్మాణాలు పునాదుల దశలోనే ఏళ్ల తరబడి ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని మారుమూల పంచాయతీ అయిన గుమ్మలో అంగన్ వాడీ కేంద్రం, పాఠశాలకు మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. అయితే అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అంగన్వాడీ కేంద్రం భవనంలోనే సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పంచాయతీ భవనం పనులు బిల్లులు విడుదల కాకపోవడంతో శ్లాబ్ దశలో నిలిచిపోయాయి. అదే విధంగా ప్రస్తుతం ప్రాధాన్యత భవనాలుగా ఉన్న సచివాలయ, రైతుభరోసా కేంద్ర భవనాలు ఏడాదిన్నర నుంచి పునాది దశలోనే ఉన్నాయి. హెల్త్ వెల్నెస్ సెంటర్ మొండిగోడలతో దర్శనమిస్తోంది. పంచాయతీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండగా, ఈ ఏడాది నాడు- నేడు పథకం ద్వారా రూ.12 లక్షల నిధులు మంజూరు కావడంతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. దీంతో పంచాయతీలో సచివాలయం, సబ్సెంటర్,పాఠశాల, అంగన్వాడీ వంటి కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరు నెలల క్రితం గ్రామంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ భవన నిర్మాణాలలో పురోగతి లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుమ్మలో ప్రభుత్వ భవన నిర్మాణాలు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.