గ్రావెల్ దందా..!
ABN , First Publish Date - 2022-02-19T06:40:16+05:30 IST
కొండలు కరుగుతున్నాయి. సర్కారు భూముల్లో నూతుల్లాంటి గోతులు పడుతున్నాయి. ఇదంతా ఏదో ప్రకృతి విపత్తు అనుకుంటే పొరపాటే.. కొందరు అధికార పార్టీ నాయకులు తమ ధనదాహాన్ని తీర్చుకునేం దుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా కళ్లప్పగించి చూస్తున్న అధికారగణం చేతులు కట్టుకుని కూర్చోవడం మినహా.. చేసింది ఏమీ లేకపోతోంది.
అచ్యుతాపురం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న తంతు
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ప్రక్రియ
కళ్లప్పగించి చూస్తున్న అధికారగణం
అచ్యుతాపురం, ఫిబ్రవరి 18: కొండలు కరుగుతున్నాయి. సర్కారు భూముల్లో నూతుల్లాంటి గోతులు పడుతున్నాయి. ఇదంతా ఏదో ప్రకృతి విపత్తు అనుకుంటే పొరపాటే.. కొందరు అధికార పార్టీ నాయకులు తమ ధనదాహాన్ని తీర్చుకునేం దుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా కళ్లప్పగించి చూస్తున్న అధికారగణం చేతులు కట్టుకుని కూర్చోవడం మినహా.. చేసింది ఏమీ లేకపోతోంది.
అచ్యుతాపురం మండలంలో గ్రావెల్ దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఇందుకు తాజాగా చోటుచేసుకున్న సంఘటన మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ఎర్రవరం గ్రామంలో కాంట్రాక్టర్ సచివాలయం, రైతు భరోసా కేంద్రంతో పాటు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఈ భవనాలు ఎత్తయిపోవడంతో చుట్టూ గల ప్రాంగణం ఎత్తు చేయాల్సి విచ్చింది. దీంతో పలువురు అధికార పార్టీ నాయకుల అండతో ఆ పక్కనే గల కొండ నుంచి, ప్రభుత్వ స్థలాల నుంచి భారీ స్థాయిలో గ్రావెల్ను రాత్రికి రాత్రి తవ్వి సచివాలయ ప్రాంగణానికి తరలించారు. ఇదిలావుంటే, పలువురు నాయకులు జగనన్న కాలనీ ఇళ్ల పునాదులు కప్పేందుకూ గ్రావెల్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కొందరు నాయకులు ఎక్సకవేటర్లను అద్దెకు తీసుకొని గ్రావెల్ను ఇష్టారాజ్వంగా తవ్వి, ట్రాక్టర్ల ద్వారా విక్రయిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్కు రూ. ఏడు వందలు వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో దోచుకుంటు న్నారో ఇట్టే అర్థమైపోతోంది. సకాలంలో పథకం ఇల్లు నిర్మించుకోకపోతే ఎక్కడ రద్దవుతుందోనని భయపడి, పలువురు లబ్ధిదారులు గ్రావెల్ కోసం అడిగినంత సమర్పించుకుంటున్నారు. ఇంత బహిరంగంగా ఈ తంతు సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడలేకపోతున్నారని పలువురు మండిపడుతు న్నారు. ఎర్రవరం నుంచి ఎంజేపురం వరకు అధికారులు పరిశీలన జరిపితే గ్రావెల్ తవ్విన గుంతలు కనిపిస్తాయని ఈప్రాంత ప్రజలు సూచిస్తున్నారు.