గరుడ వాహనంపై గరుడాచలుడు
ABN , First Publish Date - 2022-10-03T06:28:36+05:30 IST
ఉపమాకలో వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఇత్తడి గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది.
మాఢ వీధుల్లో స్వామివారి ఊరేగింపు
ఉపమాకలో ఘనంగా వెంకన్న వసంతోత్సవం
నక్కపల్లి, అక్టోబరు 2 : ఉపమాకలో వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఇత్తడి గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఏటా వసంతోత్సవంలో భాగంగా గరుడ వాహనంపై ఉభయదేవేరులతో కూడిన స్వామివారిని అలంకరించి ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. మాఢవీధుల్లో అర్చక బృందం, వైష్ణవ స్వాములు భక్తులపై వసంత జలాలను చల్లి సంప్రోక్షణ చేశారు. అంతకుముందు విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం వంటి కార్యక్రమాలు జరిపారు. ప్రత్యేక హోమాలు చేశారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, వేదపండితులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, నండూరి రాజ గోపాలాచార్యులు లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన చేశారు. టీటీడీ ఏఈవో దొరస్వామి, ఆలయ సూపరింటెండెంట్ మునిస్వామి, ఇన్స్పెక్టర్ పృథ్వీ, శివాలయం చైర్మన్ చెరుకూరి వెంకటేశ్వరరావు, రేజేటి శింగరాచార్యులు, యువీఎస్ రావు, డీవీఎస్ రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.