పంచాయతీలకు నిధులు జమచేయాలి
ABN , First Publish Date - 2022-03-16T05:56:32+05:30 IST
కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా పంచాయతీలకు మంజూరు చేసిన రూ.7665.29 కోట్లు వెంటనే పంచాయతీల ఖాతాలకు జమచేయాలని కోరుతూ పంచాయతీరాజ్ చాంబర్ సభ్యులు, సర్పంచ్లు జిల్లా కలెక్టర్కు మంగళవారం మెమోరాండం అందజేశారు.
విశాఖపట్నం, మార్చి 15: కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా పంచాయతీలకు మంజూరు చేసిన రూ.7665.29 కోట్లు వెంటనే పంచాయతీల ఖాతాలకు జమచేయాలని కోరుతూ పంచాయతీరాజ్ చాంబర్ సభ్యులు, సర్పంచ్లు జిల్లా కలెక్టర్కు మంగళవారం మెమోరాండం అందజేశారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మల్లించి తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నదని మెమోరాండంలో పేర్కొన్నారు. 73-74 అధికరణ ప్రకారం గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను సర్పంచ్ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అధికారాలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 29 శాఖలకు సంబంధించిన పూర్తి అధికారాలను గ్రామ పంచాయతీలకు బదిలీ చేసే విధంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన తలసరి గ్రాంట్ను పంచాయతీ ఖాతాలకు వెంటనే జమ చేయాలని కోరారు. జాతీయ ఉపాధి హామీ పనులు పంచాయతీల ఆధ్వర్యంలో జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షుడు వినోద్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దినుబాబు, గంభీరం సర్పంచ్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.