పోరాటాలను మరింత ఉధృతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T05:46:52+05:30 IST

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వి.శ్రీనివాస్‌, ఎన్‌.రామారావు పేర్కొన్నారు.

పోరాటాలను మరింత ఉధృతం చేయాలి
దీక్షా శిబిరంలో పోరాట కమిటీ నాయకులు, ఉక్కు ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వి.శ్రీనివాస్‌, ఎన్‌.రామారావు 

కూర్మన్నపాలెం, ఆగస్టు 16: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వి.శ్రీనివాస్‌, ఎన్‌.రామారావు పేర్కొన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం 36 గంటల పాటు  చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పాల్గొని కార్మికులంతా విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 551వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాం కానీ వెనక్కి తగ్గేదే  లేదన్నారు. సత్యగ్రహ దీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు గెలిపారు. ఐక్య ఉద్యమాల ద్వారానే విజయాలను సాధించవచ్చని, ప్రజలను ఇంకా చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతీ కార్మికునిపై ఉందన్నారు. ఉక్కు ఉద్యమం కోసం వందలాది రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, ఇక మిగిలేది స్వచ్ఛందంగా జైలుకు వెళ్లడమేనని పేర్కొన్నారు. ఏదిఏమైనా ‘ఉక్కు’ కోసం చేపట్టిన ఆందోళనలో అంతిమ విజ యం కార్మికులకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.

సత్యాగ్రహ దీక్ష విజయవంతం

ఉక్కుటౌన్‌షిప్‌: స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం చేపట్టిన సత్యాగ్రహ దీక్ష విజయవంతమైందని పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, కో-కన్వీనర్‌ కేఎస్‌ఎన్‌ రావు తెలిపారు. ఈ దీక్షలో వేలాది మంది కార్మికులు, అధికారులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వానికి తాకే విధంగా చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 

‘ఉక్కు’ సమస్యపై సీఎంకు వినతి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని సీఎం జగన్‌ను ఇంటక్‌ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ కోరారు. మంగళవారం ఆయన అచ్యుతాపురంలో ముఖ్యమంత్రిని స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు కృషి చేయాలన్నారు. కార్మికుల సమస్యలు, నిర్వాసితుల ఉపాధి విషయమై చెప్పగా.. నిర్వాసితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపినట్టు రాజశేఖర్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-08-17T05:46:52+05:30 IST