డాక్టర్స్ టీ20 ప్రీమియర్ క్రికెట్ లీగ్ ట్రోఫీ, లోగో ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-10-11T06:36:06+05:30 IST
విశాఖలో తొలిసారిగా జరగనున్న డాక్టర్స్ టీ20 ప్రీమియర్ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్ సీజన్-2 టోర్నీ ట్రోఫీ, లోగో ఆవిష్కరణ సోమవారం జరిగింది.
విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 10: విశాఖలో తొలిసారిగా జరగనున్న డాక్టర్స్ టీ20 ప్రీమియర్ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్ సీజన్-2 టోర్నీ ట్రోఫీ, లోగో ఆవిష్కరణ సోమవారం జరిగింది. వాల్తేరు రైల్వే క్రికెట్ స్టేడియం, గీతం యూనివర్సిటీ క్రికెట్ గ్రౌండ్ వేదికలుగా ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జట్లతో సుమారు 200 మంది వైద్య నిపుణులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ తరహాలో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే లయన్ కింగ్స్, రాజమండ్రి రాయల్స్, అండర్ డాక్స్, రైజింగ్ స్టార్స్, జీవీకే టైటాన్స్, డ్రీమ్ జెడ్-11, విజా అవెంజర్స్, వైజాగ్ యునైటెడ్ డెంటిస్ట్స్ జట్లతో ఎనిమిది మంది ఫ్రాంచైజర్లు పోటీపడనున్నారు. ఐపీఎల్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ మ్యాచ్లకు ఆంధ్ర క్రికెట్ సంఘం, హైదరాబాద్ క్రికెట్ సంఘం గుర్తింపు పొందినవారు అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ టీడీ రెడ్డి, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరక్టర్ అనిల్ పెండేలా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణ ప్రసాద్, శ్రావణ్ షిప్పింగ్ అధినేత సాంబశివరావు, నేరేడు కో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్, హాలిడే వరల్డ్ ఎండీ కె.విజయ్మోహన్, పల్స్ ఫార్మా సేల్స్ హెడ్ చంద్రారెడ్డి, డబుల్ హార్స్ మినపగుళ్ల సంస్థ ప్రతినిధి జగదీశ్, ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్కేఈ అప్పారావు అతిఽథులుగా హాజరై డాక్టర్ టీ20 ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నీ ట్రోఫీ, లోగోలతోపాటు ఫ్రాంచైజర్ల జెర్సీలను ఆవిష్కరించి అభినందించారు.