పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
ABN , First Publish Date - 2022-12-30T00:56:38+05:30 IST
పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు హెచ్చరించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్జీ శాస్ర్తి, ఏఎంఓహెచ్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వెంకోజీపాలెం, డిసెంబరు 29 : పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు హెచ్చరించారు. గురువారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్జీ శాస్ర్తి, ఏఎంఓహెచ్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఎంతో సుందరమైన నగరమని, ఎంతో మంది పర్యాటకులు వస్తుండడం వల్ల నగరాన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్లదేనని స్పష్టం చేశారు. పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిరోజూ శానిటరీ కార్యదర్శులతో సమీక్షించి, ఆయా ప్రాంతాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. యూజర్ చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని, ప్రతి ఇంటి నుంచి నిర్ణయించిన యూజర్ చార్జీలు వసూలు అయినట్లయితే జీవీఎంసీ నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. అలాగే తడి-పొడి చెత్త నిర్వహణ జరిగే విధంగా చూడాలని, క్లాప్ వాహనాలను డ్రైవర్లతో శుభ్రపరిచి దుర్వాసన రాకుండా చూడాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ దుకాణాల్లో అమ్మకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.