రూ.1.88 కోట్లతో జూలో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2022-10-08T06:04:27+05:30 IST

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో కోటీ 88 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జూ క్యూరేటర్‌ నందనీ సలారియా తెలిపారు.

రూ.1.88 కోట్లతో జూలో అభివృద్ధి పనులు
పనులు ప్రారంభిస్తున్న ఐఓసీఎల్‌, జూ, అటవీ శాఖ అధికారులు

శంకుస్థాపన చేసిన ఐఓసీఎల్‌, జూ, అటవీ శాఖ అధికారులు

విశాఖపట్నం, అక్టోబరు 7: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో కోటీ 88 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జూ క్యూరేటర్‌ నందనీ సలారియా తెలిపారు. ఐవోసీఎల్‌ అందజేసిన ఈ నిధులతో చేపట్టనున్న పనులకు శుక్రవారం ఐఓసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌కుమార్‌, టీఏపీఎఎస్‌వో స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.అనిల్‌కుమార్‌, సీసీఎఫ్‌ పి.రామ్మోహనరావు, డీఎఫ్‌వో అనంతశంకర్‌తో కలిసి ఆమె శంకు స్థాపన చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి ఐఓసీఎల్‌ మంజూరు చేసిన ఈ నిధులతో ఖడ్గ మృగానికి, హిమాలయన్‌ బ్లాక్‌ బేర్‌లకు  అదనపు నైట్‌ హౌస్‌లు నిర్మాణంతోపాటు బయోస్కోప్‌ సెంటర్‌ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల జూలో పుట్టిన పలు జంతువుల పిల్లలకు పేర్లు పెట్టారు. ఇందుకోసం నిర్వహించిన లక్కీడీప్‌ నుంచి వాటి పేర్లు ఎంపిక చేశారు. 


తొలుత ఏపీలో వాతావరణ మార్పుల నివారణకు మడ అడవులు, ఫిషింగ్‌ క్యాట్‌ సంరక్షణ అనే అంశాలపై వెబ్‌నార్‌ నిర్వహించారు. మడ అడువుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, అటవీ శాఖ ఆధ్వర్యంలో మడ అడువుల పెంపకం గురించి డీఎఫ్‌వో అనంతశంక్‌ సోదాహరణగా వివరించారు. అదేవిధంగా గోదావరి డెల్టాలో ఫిషింగ్‌ క్యాట్‌ సంరక్షణ చర్యలు గురించి తెలిపారు.  

Updated Date - 2022-10-08T06:04:27+05:30 IST