రూ.2 కోట్లతో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-08-15T06:05:23+05:30 IST
జిల్లాలోని అల్లూరి స్మారక ప్రాంతాలను రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఈ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తమకు అప్పగించినందని ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు తెలిపారు.
క్షత్రియ సేవా సమితికి బాధ్యతలు అప్పగించిన కేంద్రం
సమితి ఏపీ, టీఎస్ ప్రధాన కార్యదర్శి నానిరాజు
చింతపల్లి, ఆగస్టు 14: జిల్లాలోని అల్లూరి స్మారక ప్రాంతాలను రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఈ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తమకు అప్పగించినందని ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజుతో కలిసి నాడు అల్లూరి సీతారామరాజు దాడిచేసిన చింతపల్లి పోలీసు స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులతో అల్లూరి పోరాటం కొనసాగించిన ప్రాంతాలను ఆధునీకరిస్తామన్నారు. మంప చెరువు సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే రాజేంద్రపాలెం స్మారక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కళాఖండాలను ఏర్పాటు చేస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు దాడిచేసిన నాటి చింతపల్లి బ్రిటీష్ పోలీస్ స్టేషన్ పునరుద్ధరించి అభివృద్ధి చేస్తామన్నారు. పాండ్రంగిలోని అల్లూరి అమ్మమ్మ ఇంటిని ఒక మ్యూజియంలా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన కేంద్ర మంత్రులతో చింతపల్లిలో బహిరంగ సభఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అల్లూరి సాయుధ పోరాటానికి వందేళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో చింతపల్లి ఏఎస్పీ తుషార్ డుడి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, ఏఎంసీ చైర్పర్సన్ హలియారాణి, సర్పంచ్ దురియా పుష్పలత పాల్గొన్నారు.