సీబీఎస్ఈ పాఠశాలల వసతులపై డీఈవో ఆరా
ABN , First Publish Date - 2022-02-19T06:26:13+05:30 IST
సీబీఎస్ఈకి ఎంపికైన పాఠశాలల్లో వసతులపై డీఈవో ఎల్.చంద్రకళ ఆరా తీశారు.
వడ్డాది, రావికమతం స్కూళ్లలో తనిఖీలు
బుచ్చెయ్యపేట/రావికమతం, ఫిబ్రవరి 18: సీబీఎస్ఈకి ఎంపికైన పాఠశాలల్లో వసతులపై డీఈవో ఎల్.చంద్రకళ ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం రావికమతం, బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ఈ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి వరకు సీబీఎస్ఈ బోధనకు అవసరమైన వసతుల గురించి ఆరా తీశారు. సీబీఎస్ఈ అమలుకు జిల్లాలో 29 ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయని, అందులో ఈ రెండు స్కూళ్లు ఉన్నాయని డీఈవో చెప్పారు. లైబ్రరీ, ల్యాబ్, ఆట స్థలాలు, ఇతర సౌకర్యాలను ఉన్నాయో, లేదో తెలుసుకుంటున్నామన్నారు. అయితే రావికమతం హైస్కూల్ ప్రహారీ గోడను ఆనుకుని చెత్తాచెదారం చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఎంత నిలువరిస్తున్నప్పటికీ చెత్తనంతా తెచ్చి ఇక్కడే వేసేస్తున్నారని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు కిరణ్మయి, దేముడమ్మ, నోడల్ హెచ్ఎం వీవీఎస్.నగేశ్వరావు, హెచ్ఎంలు మల్లికార్జునరావు, శేషుబాబు, వరహామూర్తి సీఆర్పీ కుమార్ పాల్గొన్నారు.