పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీకి శ్రీకారం
ABN , First Publish Date - 2022-05-30T05:43:41+05:30 IST
పాఠశాలలకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటివరకు విశాఖ జిల్లాలో 3,62,478 పుస్తకాలు పంపిణీ
గాజువాక, మే 29: పాఠశాలలకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు జిల్లాలకు గాజువాకలో ఉన్న జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కార్యాలయం నుంచే పంపిణీ కానున్నాయి. విశాఖ జిల్లా లో 7, అనకాపల్లి జిల్లాలో 25, అల్లూరి జిల్లాలో 11 మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆధారంగా 39,62,478 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ముద్రణా కార్యాలయాల నుంచి ఇప్పటివరకు కొన్ని తరగతులకు సంబంధించి 15,59,032 పాఠ్య పుస్తకాలు గాజువాకలోని పుస్తక విక్రయ కార్యాలయానికి చేరాయి.. ఇంకా 24 లక్షల పైచిలుకు పాఠ్యపుస్తకాలు చేరాల్సి ఉంది. కాగా తొలి విడతగా విశాఖ జిల్లా పరిధిలో ఉన్న పాఠశాలలకు ఇప్పటివరకు 3,62,478 పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. మిగతా జిల్లాలకు కూడా క్రమేపీ పంపిణీ చేయనున్నట్టు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను విజయవాడ, గుంటూరులతోపాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ప్రింటింగ్ ప్రెస్లలో ముద్రిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ముద్రణాలయాల నుంచి విడతల వారీగా పాఠ్య పుస్తకాలు సరఫరా అవుతున్నందున, వచ్చిన పుస్తకాలను వచ్చినట్టే ఎంఈఓ కార్యాలయాలకు తరలించేవిఽధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.