చిన్న ఉద్యోగమైనా వదులుకోవద్దు

ABN , First Publish Date - 2022-09-17T06:24:32+05:30 IST

గిరిజన నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.

చిన్న ఉద్యోగమైనా వదులుకోవద్దు
జాబ్‌ మేళాలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

జాబ్‌ మేళాలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

1,620 మంది గిరిజన యువత హాజరు

ఉద్యోగాలకు 314 మంది ఎంపిక 


పాడేరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగాజాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, చిన్నపాటి ఉద్యోగానికి కూడా పోటీ అధికంగా వుందని, అందువల్ల తక్కువ జీతమనో, దూర ప్రాంతమనో... వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. తొలుత ఉద్యోగంలో చేరి, విధి నిర్వహణలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకుని, తద్వారా ఉన్నతస్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. 11 ప్రైవేటు కంపెనీల్లో 770 పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఈ జాబ్‌ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.  

జాబ్‌మేళాకు 1,620 మంది హాజరు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు 1,620 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్హతలు, ప్రతిభ, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, 314 మందిని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ నియామక ఉత్తర్వులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పీ కె.సతీశ్‌కుమార్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిణి రోషిణి, జిల్లా ఉపాధి కల్పనాధికారి సంగీత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-17T06:24:32+05:30 IST