జోల్డ పండగ జోష్
ABN , First Publish Date - 2022-09-08T06:54:37+05:30 IST
మన్యంలోని ప్రతి ఆచార వ్యవహారం వైవిధ్యంగానే ఉంటుంది. దీని వెనుక సంప్రదాయం, శాస్ర్తీయత ఉంటాయి. ఆ కోవకే చెందుతుంది గిరిజనులు ఆచరించే ’జొల్డ పండగ’. ఏజెన్సీలో గిరిజన రైతులు జొల్డ పండగను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీంతో పంట పొలాల్లో జొల్డ పండగ సందడి నెలకొంది.
- వరి నాట్లు పూర్తయిన తరువాత చేసే తొలి వ్యవసాయ వేడుక
- ఇలా చేస్తే పంటలకు చీడపీడలు పట్టవని గిరి రైతుల విశ్వాసం
- తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం
(ఆంధ్రజ్యోతి- పాడేరు)
మన్యంలోని ప్రతి ఆచార వ్యవహారం వైవిధ్యంగానే ఉంటుంది. దీని వెనుక సంప్రదాయం, శాస్ర్తీయత ఉంటాయి. ఆ కోవకే చెందుతుంది గిరిజనులు ఆచరించే ’జొల్డ పండగ’. ఏజెన్సీలో గిరిజన రైతులు జొల్డ పండగను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీంతో పంట పొలాల్లో జొల్డ పండగ సందడి నెలకొంది.
-------
మైదాన ప్రాంతాలకు భిన్నంగా, ఇతరులకు ఆసక్తి కలిగేలా గిరిజనుల ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటిపై గిరిజనులు తరతరాలుగా విశ్వాసం ఉంచి, పాటిస్తూనే ఉంటారు. అటువంటి వ్యవహారాల్లో ఒకటి జొల్డ పండగ. ఏజెన్సీలో గిరిజనులు వరి నాట్లు పూర్తయిన మూడు వారాలకు జొల్డ పండగను నిర్వహిస్తారు. ప్రతి గిరిజన రైతు విధిగా ఈ పండగను బుధవారం మాత్రమే నిర్వహించాలనే నిబంధన తరతరాలుగా కొనసాగుతున్నది. దీంతో వరిసాగు చేసే ప్రతి రైతు నాట్లు పూర్తయిన మూడు వారాల తరువాత వచ్చే బుధవారం నాడు కచ్చితంగా ఈ పండగను చేస్తారు.
పండగ ఆచారం ఇలా..
గిరిజన రైతులు వరి నాట్లు పూర్తయిన మూడు వారాల తరువాత అడవుల్లోకి వెళ్లి కస్మి, సీడి, పెద్ద జొల్డ మొక్కల కొమ్ములను తీసుకువస్తారు. ఇంటి వద్ద లేదా గ్రామ సావిడి వద్ద కోడిని కోసి, దాని రక్తాన్ని బియ్యంలో కలిపి అక్షింతలు చేస్తారు. అలాగే అన్నంలో సైతం పసుపు, కోడి రక్తం కలుపుతారు. వాటిని అడవుల నుంచి తీసుకువచ్చిన కొమ్మలను పట్టుకుని ఇంటిల్లపాది తమ పంట పొలాలకు వెళతారు. అక్కడ దేవతలకు మొక్కి తరువాత అడవుల నుంచి తీసుకువచ్చిన మొక్కల కొమ్మలను పంట పొలాల్లో పాతుతారు. అలాగే పూజ చేసి తీసుకువచ్చిన అక్షింతలు, అన్నం మెతుకులను సైతం పంట పొలాల్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల పంట బాగుంటుందని, లేకుంటే పంట పాడ వుతుందని గిరిజన రైతుల నమ్మకం.
సంప్రదాయం వెనుక శాస్ర్తీయం
వరి నాట్లు పూర్తయిన మూడు వారాల తరువాత సంప్రదాయంగా గిరిజనులు నిర్వహించే జొల్డ పండగ వెనుక శాస్ర్తీయత దాగి ఉందని పలువురు పూర్వీకులు అంటున్నారు. ఈ సంప్రదాయ పండగలో భాగంగా రైతులు పొలాల్లో పాతే మొక్కల కొమ్మలు ఔషధ మొక్కలకు చెందినవని గిరి రైతులు అంటున్నారు. ఔషధ గుణాలు కలిగిన కస్మి, సీడి, పెద్ద జొల్డ మొక్కల కొమ్మలను పంట పొలాల్లో పాతడం వల్ల, లేత వరి పైరును ఆశించాలనుకునే పలు రకాల పురుగులను ఈ కొమ్మలు ఆకర్షించి వరి పంటను కాపాడతాయని పలువురు చెబుతున్నారు. అయితే సస్యరక్షణలో భాగంగా చేపట్టాల్సిన ఈ చర్యను సంప్రదాయం, ఆచారాల్లో కలిపి చేయడం వల్ల గిరిజనులు పండగగా భావించి, విధిగా దానిని పాటిస్తారనే ఆలోచనతో పూర్వీకులు జొల్డ పండగగా నామకరణం చేసి ఆచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ఆచారాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నామని పాత, కొత్తపాడేరు గ్రామాలకు చెందిన పెద్దలు, గిరిజన రైతులు తెలిపారు.