ధారకొండ దారి దోపిడీ ప్రధాన నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-02-23T05:44:10+05:30 IST
విశాఖ ఏజెన్సీలోని ధారకొండ ఘాట్లో వరుస దారి దోపిడీలకు పాల్పడిన ప్రధాన నిందితులు ఇద్దర్ని అరెస్టు చేసినట్టు చింతపల్లి అదనపు ఎస్పీ తుషార్ డుడి తెలిపారు.
చింతపల్లి, ఫిబ్రవరి 22: విశాఖ ఏజెన్సీలోని ధారకొండ ఘాట్లో వరుస దారి దోపిడీలకు పాల్పడిన ప్రధాన నిందితులు ఇద్దర్ని అరెస్టు చేసినట్టు చింతపల్లి అదనపు ఎస్పీ తుషార్ డుడి తెలిపారు. మంగళవారం సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, అక్టోబరు మాసాల్లో ఒడిశాకు చెందిన దొంగలు ధారకొండ ఘాట్లో దారిదోపిడీకి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు దారిదోపిడీ దొంగలను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను విస్తృతం చేశారన్నారు. ఇప్పటికే దారిదోపిడీకి పాల్పడిన పది మంది దొంగలను అరెస్టు చేసి, రిమాండ్కి పంపించామన్నారు. ఈ దారిదోపిడీలో ప్రధాన నిందితులైన సంజయ్ మండల్, నరేశ్ మండల్ని సోమవారం ఒడిశాలో అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితులిద్దరూ ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా ఎంవీ-113, ఎంపీవి-41 గ్రామాలకు చెందినవారన్నారు. ప్రధాన నిందితుడు సంజయ్ మండల్ 2015 నుంచి దారిదోపిడీలకు పాల్పడుతున్నారని, ఇతనిపై ఒడిశా, తూర్పుగోదావరి, సీలేరు పోలీసుస్టేషన్లలో 15 కేసులు ఉన్నాయన్నారు. అరెస్టు చేసిన నిందితులిద్దరి నుంచి మూడు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ధారకొండ దారిదోపిడీ కేసును ఛేదించిన జీకేవీధి సీఐ అశోక్కుమార్, సీలేరు ఎస్ఐ టి.రవికుమార్, కానిస్టేబుళ్లు జి.సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్, వై. శ్రీధర్లకు నగదు ప్రోత్సాహాలను ఏఎస్పీ అందజేశారు.