నిత్యావసరాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-08-25T05:56:54+05:30 IST
ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లకు సరఫరా చేసే నిత్యావసర సరకుల్లో నాణ్యత లోపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు.
డిప్యూటీ వార్డెన్గా ప్రధానోపాధ్యాయుడు పని చేయడానికి వీల్లేదు
ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరిక
పాడేరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లకు సరఫరా చేసే నిత్యావసర సరకుల్లో నాణ్యత లోపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ హెచ్చరించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం జీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల సరఫరా నిమిత్తం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలకు పెరుగు సక్రమంగా సరఫరా చేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కూర గాయలు, గుడ్లు, పాలు సరఫరా పక్కాగా జరగాలని, లోపాలుంటే ఉపేక్షించ బోనని పీవో హెచ్చరించారు. సరకుల సరఫరాలో లోపాలుంటే సంబంధిత డిప్యూటీ వార్డెన్ను సస్పెండ్ చేస్తామన్నారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఎక్కడా డిప్యూటీ వార్డెన్ విధులు నిర్వహించడానికి వీల్లేదని తెలిపారు. ఈ మేరకు వెంటనే సర్కులర్ జారీ చేయాలని గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడిని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి డిప్యూటీ వార్డెన్ను విధిగా మార్చాలన్నారు. అంతరాయం లేకుండా వసతి గృహాలకు వంట గ్యాస్ పంపిణీ చేయాలని జీసీసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు, జీసీసీ డీఎంలు కె.పార్వతమ్మ, డి.సింహాచలం, ఏటీడబ్ల్యూవోలు, జీసీసీ బ్రాంచ్ మేనేజర్లు, టెండర్దారులు పాల్గొన్నారు.
పెట్రోల్ బంకులను వేగవంతంగా నిర్మించండి
ఏజెన్సీలో పెట్రోల్ బంకులను వేగవంతంగా నిర్మించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు, హెచ్పీసీఎల్ అధికారులు, కాంట్రాక్టర్లతో పెట్రోల్ బంకుల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకులోయ మండలం పానిరంగిని, పాడేరు మండలం తలారిసింగి, ముంచంగిపుట్టు మండలం లుంగాపుట్టు, అనంతగిరి, కొయ్యూరు మండలం నడింపాలెం, చింతపల్లి మండలం తాజంగి గ్రామాల్లో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకుల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. అరకులోయ పెట్రోల్ బంకు పనులు సెప్టెంబరు 15 నాటికి, పాడేరు, ముంచంగిపుట్టులో అక్టోబరు 15 నాటికి పూర్తిచేయాలని పీవో ఆదేశించారు. అలాగే తాజంగి, అనంతగిరి, కొయ్యూరు మండలాలకు చెందిన బంకు పనులు నవంబరు ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్.ప్రభాకర్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్ఎం.రాజు, డీఈఈలు, ఏఈఈలు, హెచ్పీసీఎల్ మేనేజర్ చరణ్కుమార్ పాల్గొన్నారు.