రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2022-12-10T01:21:37+05:30 IST
మండలంలోని బాటజంగాలపాలెం సమీపంలో అనకాపల్లి- ఆనంద పురం జాతీయ రహదారిపై శుక్రవారం వేకుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
సబ్బవరం, డిసెంబరు 9: మండలంలోని బాటజంగాలపాలెం సమీపంలో అనకాపల్లి- ఆనంద పురం జాతీయ రహదారిపై శుక్రవారం వేకుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మంచాడవలసకు చెందిన పూసర్ల ఈశ్వరరావు (28) పెందుర్తి మండలం పురుషోత్తపురం వద్ద గల ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అనకాపల్లి సమీపంలో తోటాడలో గల పౌలీ్ట్రస్ వద్ద కంపెనీకి సంబంధించిన మెటీరియల్ లోడింగ్ పనిపై ఈశ్వరరావు పెందుర్తి నుంచి బైక్పై వెళ్లాడు. రాత్రి లోడింగ్ పని చూసుకొని శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బైక్పై పెందుర్తి బయల్దేరాడు. జాతీయ రహదారిపై వెళుతుండగా, బాటజంగాలపాలెం సమీపంలో బైక్ అదుపు తప్పడంతో ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొనడంతో రోడ్డుపై పడిపో యాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడి వద్ద ఉన్న ఆధార్ కార్డులో అడ్రస్ తెలుసుకుని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు సీఐ రంగనాథం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలు ఆర్టీసీ డ్రైవర్ ఇంట్లో చోరీ
చోడవరం, డిసెంబరు 9: పట్టణ శివారు చోడవరం-గోవాడ రోడ్డులో బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్కు సమీపంలో నివసిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ బండారు వెంకటరావు ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. డ్రైవర్ భార్య మేడపైన ఉండడం గమనించిన వ్యక్తులు ఇంటి వెనుక భాగం నుంచి ఇంట్లోకి ప్రవేశించి ల్యాప్టాప్తోపాటు, రూ. 20వేలు నగదు ఎత్తుకుపోయారు. మేడ పైనుంచి ఇంట్లోకి వచ్చిన డ్రైవర్ భార్యకు ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతోపాటు నగదు ల్యాప్టాప్ ఎత్తుకుపోయినట్టు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్ఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి వెళ్లి దొంగతనానికి సంబంధించి వివరాలు సేకరించారు.