స్పందనకు 154 వినతులు
ABN , First Publish Date - 2022-06-07T06:58:58+05:30 IST
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందనకు వివిధ సమస్యలపై 154 వినతులు అందాయి.
గత వారం కంటే తగ్గిన అర్జీల సంఖ్య
పలు శాఖల అధికారులు గైర్హాజరు
అనకాపల్లి కలెక్టరేట్, జూన్ 6: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందనకు వివిధ సమస్యలపై 154 వినతులు అందాయి. డీఆర్వో వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ సీతామహలక్ష్మి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం బదలాయించారు. ఉదయం నుంచి వర్షం పడడంతో అర్జీదారుల పెద్దగా రాలేదు. దీంతో గత వారం కంటే వినతల సంఖ్య తగ్గిపోయింది. గత వారం 181 అర్జీలు రాగా, సోమవారం 154 మంది మాత్రమే వినతిపత్రాలు అందించారు. ఇదిలా ఉండగా వివిధ శాఖల అధికారులు కూడా స్పందనకు గైర్హాజరయ్యారు.
కె.కోటపాడు మండలంలో టీడీపీకి చెందిన 12 మంది గ్రామ సర్పంచ్లు స్పందన కార్యక్రమానికి హాజరై తమకు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు విషయంలో మండలస్థాయి అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని డీఆర్వో వెంకటరమణకు విన్నవించుకున్నారు. పంచాయతీలకు ప్రథమ పౌరులుగా వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్పందన ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి
అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిశాలి
అనకాపల్లి రూరల్, జూన్ 6: బాధితులు అందించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి అధికారులను ఆదేశించారు. శంకరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొని వినతులను స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్దేశిత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఇదిలా ఉండగా స్పందన కార్యక్రమం ముగిసే సరికి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఇతరుల చేతిలో మోసపోవడం వంటి సమస్యలపై 20 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ (క్రైమ్స్) బి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.