sharannavaratri celebrations: సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ... ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-10-02T12:38:27+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Devi sharannavaratri celebrations) వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్య లో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. సరస్వతిదేవి దర్శనార్థం క్యూలైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించారు. మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తి రూపాలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు. భక్తజనుల అగ్నానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయినీ సరస్వతి దేవి. సరస్వతి దేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.
మరోవైపు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అన్ని క్యూలైన్స్ ఉచితంగా ప్రకటించారు. వీఐపీలకు , వృద్దులు , వికలాంగులు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ వైపు వచ్చే అన్ని మార్గాలలో బారికేడ్లతో భారీ బందోబస్తు నిర్వహించారు. బస్టాండు నుంచి కాలినడకనే భక్తులను అనుమతి ఇస్తున్నారు. డ్యూటీ పాస్లు ఉన్న వారిని కూడా పోలీసులు ఆపేస్తున్నారు. అర్చకులు, ఆలయ, రెవెన్యూ, మీడియా సిబ్బంది అయినా వెనక్కు వెళ్లి పోవాలని చెబుతున్నారు. విషయం చెప్పినా పోలీసు అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.