తెలుగు రాష్ర్టాలకు మరో రెండు హైవేలు
ABN , First Publish Date - 2022-02-23T08:50:43+05:30 IST
ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారులను మంజూరుచేసింది. భారత్మాలా పరియోజనలో భాగంగా రూ.2824.18 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు మంగళవారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారులను మంజూరుచేసింది. భారత్మాలా పరియోజనలో భాగంగా రూ.2824.18 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అందులో సోలాపూర్-కర్నూలు-చెన్నై ఎకనామిక్ కారిడార్లో భాగంగా రూ.972.06 కోట్లతో ఎన్హెచ్ 150సీ పై తెలంగాణ-కర్ణాటక సరిహద్దు (రాయచూర్ గద్వాల రోడ్డు నుంచి) నుంచి గద్వాల జిల్లాలోని జూలకల్ గ్రామం వరకు ఆరు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేశామని పేర్కొన్నారు. అలాగే, రూ.1852.12 కోట్ల వ్యయంతో ఎన్హెచ్ 71పై చిత్తూరు జిల్లా మదనపల్లి-పీలేరు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు.