ttd: శ్రీవారి సేవలో గవర్నర్
ABN , First Publish Date - 2022-10-04T02:20:20+05:30 IST
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) సోమవారం మధ్యాహ్నం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) సోమవారం మధ్యాహ్నం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి (Subbareddy), ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన హరిచందన్ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. తర్వాత గవర్నర్కు అద్దాలమండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
సూర్య, చంద్రప్రభ వాహనాలపై గోవిందుడి దర్శనం
తిరుమల బ్రహ్మోత్సవాల్లో సోమవారం సూర్య, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప కొలువుదీరారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో సూర్యప్రభపై మత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం నేత్రానందంగా జరిగింది.రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో మలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.బ్రహోత్సవాల్లో ప్రధానంగా భావించే మహా రథోత్సవం మంగళవారం ఉదయం జరుగనుంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత మహారథం మాడవీధుల్లో తిరగనుంది.