TTD: తిరుమలలో పోటెత్తుతున్న భక్తులు

ABN , First Publish Date - 2022-10-01T23:16:06+05:30 IST

బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలు నిండిపోయాయి.

TTD: తిరుమలలో పోటెత్తుతున్న భక్తులు

తిరుమల: బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలు నిండిపోయాయి. కొండపై పార్కింగ్‌ ఫుల్‌ అయింది. దీంతో అలిపిరి దగ్గరే వాహనాల నిలిపివేస్తున్నారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. తిరుపతిలో 13 చోట్ల టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటలకు శ్రీవారికి గరుడ వాహన సేవ జరుగనుంది. పెరటాశి రెండవ శనివారం కూడా కలసిరావడంతో భక్తులు భారీగా తిరుమలకు వచ్చారు. ఆలయంలోని మూలవర్లకు అలంకరించే సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంటి, పచ్చ, సూర్యకఠారి, ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలతో అలంకృతుడై గరుత్మంతుడిని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగే మలయప్పను చూసి తరించేందుకు చాలామంది ముందురోజే తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీ. 


ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసి సర్వదర్శనాలను మాత్రమే అమలు చేస్తున్న క్రమంలో  వేగంగా స్వామిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం స్వామిని దర్శించుకుంటే శనివారం వాహనసేవలో పాల్గొనవచ్చనే అభిప్రాయంతో చాలా మంది భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు క్యూలైన్ల వద్ద నిరంతరాయంగా అన్నప్రసాదాలు వితరణ చేస్తున్నారు.

Updated Date - 2022-10-01T23:16:06+05:30 IST