పులకరించిన తుంగా తీరం
ABN , First Publish Date - 2022-08-15T08:57:35+05:30 IST
పులకరించిన తుంగా తీరం
వైభవంగా రాఘవేంద్రుల మహా రథోత్సవం
మంత్రాలయం, ఆగస్టు 14: అశేషంగా తరలి వచ్చిన భక్తులతో మంత్రాలయం తుంగా తీరం పులకరించింది. గుండెల నిండా భక్తి నింపుకుని దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులు ‘మూలరామా విజయథే.. తుంగా తీరా నివాసా రాఘవేంద్రాయ నమో నమ:’’ అంటూ ఆనందంతో పరవశించారు. రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాల్లోని ఉత్తరాధనలో భాగంగా ఆదివారం మహా రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను సంస్కృత పాఠశాల వరకు ఊరేగించి తిరిగి శ్రీమఠానికి తీసుకువచ్చారు. ఉత్సవమూర్తిని రథంపైకి ప్రతిష్ఠిస్తుండగా.. లక్షలాది మంది భక్తులు జయహో గురు రాఘవేంద్ర.. విజయహో అంటూ పెద్ద ఎత్తున జయధ్వానాలు పలికారు. బెంగళూరు నుంచి కిరణ్ అనే భక్తుడు తెచ్చిన హెలికాప్టర్ నుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు రథంపై పూలవర్షం కురిపించారు. అనంతరం శ్రీమఠానికి చేరుకున్న మహా రథం నుంచి ఉత్సవమూర్తిని బృందావనం ముందు ఉంచి పూజలు చేశారు. పీఠాధిపతి మహామంగళ హారతులు ఇచ్చి భక్తులను ఆశీర్వదించి మూలరాములకు పూజలు చేశారు.