ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన బాట
ABN , First Publish Date - 2022-08-10T08:01:50+05:30 IST
ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన బాట
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలివ్వాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న సామూహికంగా సెలవులు పెట్టి ఏపీఐఐసీ ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించారు. 29 నుంచి విధుల బహిష్కరణకు సిద్ధమైనట్లు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డీ దయామణి, కన్వీనర్ సీహెచ్ ప్రభాకర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపటి నుంచి ఆరోగ్య మిత్రాలు కూడా..
ఆరోగ్యశ్రీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రాలు కూడా ఆందోళనలకు సిద్ధమయ్యారు. పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రాలను నెట్వర్క్ ఆస్పత్రులకు అటాచ్ చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి విధులు బహిష్కరించి, జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.