సభలో పుట్టుకల ప్రస్తావన బాధిస్తోంది
ABN , First Publish Date - 2022-09-17T10:25:34+05:30 IST
The mention of births in the assembly hurts
సమస్యలు లేవనెత్తాలంటే డీఎన్ఏ సర్టిఫికెట్ తేవాలేమో?
అధికార పక్షం సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘ఇటీవల శాసనసభలో పుట్టుకలకు సంబంధించి సభ్యులు ప్రస్తావిస్తున్న తీరు బాధిస్తోంది. ఇక నుంచి నేను సభలో ప్రజా సమస్యలను లేవనెత్తేముందు ఎవరికి పుట్టానో ధృవీకరించే డీఎన్ఏ పరీక్ష సర్టిఫికెట్ను తీసుకురావాలేమో!’’ అంటూ సీమకి చెందిన పాలకపక్ష సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాం గణంలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘ఏ కులంలో, ఏ మతంలో, ఏ కుటుంబ ంలో, ఏ దంపతులకు పుట్టాలో ఎవరికీ తెలియదు. అది దైవానుగ్రహం. కానీ, ఇటీవల సభ్యులు కొందరు ‘నువ్వెలా పుట్టావు?’ అంటూ ప్రశ్నించడం సాధారణ ప దంగా మారిపోయింది’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను 1980వ దశకంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. పలువురు సీఎంలను, మంత్రులను చూ శా. ఉమ్మడి శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఎ.నరేంద్ర పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూనిఫారం నాణ్యతతో లేదంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో అప్పటి మంత్రి ప్రతిభా భారతిని ఉద్దేశించి... ‘మంత్రిగారు చీరలపై ఉంచిన శ్రద్ధ పాఠశాల విద్యార్థుల దుస్తులపై ఉంచితే బాగుండు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై... ప్రతిభా భారతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో నరేంద్ర... ‘నేను మంత్రి దుస్తులకు సంబంధించి దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదు. ఆమె వ్యక్తిగతంగా బాధపడితే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. నన్ను క్షమించాలి’ అని కోరారు. అప్పట్లో ఇలాంటి హూందా తనం కనిపించేది. కానీ ఈ రోజు వైరిపక్షానికి చెందిన ఎమ్మెల్యే తన వ్యాఖ్యలతో ఎంత కలత చెందితే అంతగా ఆనందపడే రోజులను చూస్తున్నాం’’ అని ఆ సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.