పిల్లలు సరిగా చదువుకోలేదు
ABN , First Publish Date - 2022-06-12T08:34:17+05:30 IST
పిల్లలు సరిగా చదువుకోలేదు
అందుకే టెన్త్ ఫెయిలయ్యారు.. సప్లిమెంటరీ రాసే చాన్సిచ్చాం: రోజా
తిరుమల, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ అధికారంలో ఉన్న టీచర్లే ఇప్పుడూ ఉన్నారు. కొవిడ్ కారణంగానో, సరిగా చదువుకోకపోవడం వల్లనో కొంతమంది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ రాసే అవకాశమిచ్చాం. అందులో పాస్ అయినవారికి రెగ్యులర్గా ఇచ్చే సర్టిఫికెట్లే ఇస్తాం. టెన్త్లో మనకంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిన రాష్ర్టాలు ఉన్నాయి. లోకేశ్ జూమ్ మీటింగ్లు పెట్టి పిల్లల మైండ్ను పాయిజన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు అడ్డదిడ్డంగా పెరిగాడే గానీ బుర్ర పెరగలేదు. చంద్రబాబుకు చిన్న ఇబ్బంది కలిగితే పవన్ కల్యాణ్ ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు’ అని విమర్శించారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ టీడీపీ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.