లారీని ఢీకొన్న బస్సు
ABN , First Publish Date - 2022-02-20T02:43:53+05:30 IST
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది.
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 33 మంది వలస కూలీలకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం బరంపూర్ నుంచి 47 మంది వలసకూలీలతో ఈ బస్సు శుక్రవారం రాత్రి తమిళనాడు బయలుదేరింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో పైడిభీమవరం సమీపంలో వంతెన వద్ద ఆగి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో బస్సు క్యాబిన్లో డ్రైవర్లు బిజు, అనూష్లు చిక్కుకున్నారు. వీరితోపాటు మరో 31 మంది గాయపడ్డారు. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లపై శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్-రిమ్స్)కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డ్రైవర్ బిజు, అనూష్ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు.