తమిళనాడుకు ప్రిజన్స్ అకాడమీ?
ABN , First Publish Date - 2022-08-17T09:18:18+05:30 IST
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన జాతీయ అకాడమీని జగన్ ప్రభుత్వం చేజేతులా జారవిడుచుకుంది.
ఏపీకి కేటాయించిన నాటి హోంమంత్రి రాజ్నాథ్
అనంతలో స్థలం కేటాయించిన టీడీపీ ప్రభుత్వం
గత మూడేళ్లుగా పట్టించుకోని జగన్ సర్కారు
చివరకు తన్నుకుపోయిన స్టాలిన్ ప్రభుత్వం!
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన జాతీయ అకాడమీని జగన్ ప్రభుత్వం చేజేతులా జారవిడుచుకుంది. ఏపీలో ఎక్కడ స్థలం కేటాయించినా నేషనల్ ప్రిజన్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని నాలుగేళ్ల క్రితం నాటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజయవాడలో ప్రకటించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అనంతపురంలోని అగ్రికల్చర్ ప్రిజన్స్ కాలనీలో వందెకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. ఇదే అదునుగా పొరుగు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వంలో సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఒక తమిళ అధికారి ప్రిజన్స్ అకాడమీపై స్టాలిన్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. ఈ క్రమంలో రాయ్ వెల్లూరులో ఉన్న దక్షిణాది రాష్ట్రాల సదరన్ ప్రిజన్స్ అకాడమీని... నేషనల్ ప్రిజన్స్ అకాడమీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రాన్ని స్టాలిన్ సహకారం కోరారు.