విశాఖ ఎంపీకి ఉక్కు సెగ

ABN , First Publish Date - 2022-08-16T08:01:21+05:30 IST

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), ఆగస్టు 15:

విశాఖ ఎంపీకి ఉక్కు సెగ

ప్లాంటు ప్రైవేటీకరణపై ఏం చేస్తున్నారని కార్మికుల నిలదీత

రాజీనామా చేయాలని డిమాండ్‌

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), ఆగస్టు 15: ఉక్కు కార్మికుల నుంచి సోమవారం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు నిరసన ఎదురైంది. తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. వివరాలు.... స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకూ (36 గంటలు) సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సోమవారం దీక్షా శిబిరాన్ని ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడేందుకు ఆయన యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. మంగళవారం అచ్యుతాపురం వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని దీక్షా శిబిరం వద్దకు తీసుకువచ్చి, ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని ప్రకటింపజేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 550 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తుంటే ఒక్కరోజు కూడా సీఎం వచ్చి మద్దతు తెలపలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్లాంట్‌కు సొంత గనులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంటే...అంతా ఢిల్లీలోనే వుండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 


ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కావాలనే తగ్గిస్తున్నా, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ తన రాజీనామాతో విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకుంటే...అందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ అంశంపై టీడీపీ ఎంపీలు ఒక్కరైనా ప్లకార్డు పట్టుకొని పోరాటాలు చేశారా, పార్లమెంటులో ఈ అంశాన్ని ఒక్కసారైనా లేవనెత్తారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కావాలనే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా ఉక్కు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంటున్న కొందరు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని, పోరాటాలకు ముందుకు రావాలన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశారని, ప్రధానికి మూడుసార్లు లేఖలు రాశారన్నారు. కార్మిక నాయకులతో రెండు గంటలు పాటు విమానాశ్రయంలో సమావేశమయ్యారన్నారు. వైసీపీ ఎంపీలంతా ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటులో పోరాటాలు చేస్తున్నామన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ముందుకు పోతోందన్నారు.

Updated Date - 2022-08-16T08:01:21+05:30 IST