రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-09-29T04:21:58+05:30 IST

ఎల్‌.ఎన్‌.పేట మండలం స్కాట్‌పేట సమీపంలోని శ్రీనివాస రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. 182 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు
బియ్యం బస్తాలను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

- 182 బియ్యం బస్తాలు స్వాధీనం
ఎల్‌.ఎన్‌.పేట, సెప్టెంబరు 28:
ఎల్‌.ఎన్‌.పేట మండలం స్కాట్‌పేట సమీపంలోని శ్రీనివాస రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. 182 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమాని రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నట్టు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం డీఎస్పీ ఎస్‌.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రైస్‌మిల్లును తనిఖీ చేశారు. ఒక గదిలో రేషన్‌ బియ్యం నిల్వలు కనిపించాయి. 50 కిలోల చొప్పున 182 బియ్యం బస్తాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని ఎల్‌.ఎన్‌.పేట సీఎస్‌డీటీ డి.రామకృష్ణకు అప్పగించామని విజిలెన్స్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.3,45,800 ఉంటుందన్నారు. మిల్లులో ధాన్యం, ఇతర బియ్యం వివరాలు నమోదు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా.. వివరాలు చెప్పేందుకు మిల్లు యజమాని నిరాకరించడంతో పాటు అధికారులతో వాదనకు దిగారు. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరించడంతో వారికి అయిష్టంగానే సహకరించారు. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని సరుబుజ్జిలి పౌరసరఫరాలశాఖ గిడ్డంగికి తరలించామని సీఎస్‌డీటీ డి.రామకృష్ణ తెలిపారు. అనంతరం మండలంలో పెద్దకొల్లివలస గ్రామ సచివాలయాన్ని విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. పనుల వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు ఎస్సైలు అశోకచక్రవర్తి, రామారావు, హెచ్‌సీలు జి.రామ్మోహన్‌రావు, కె.అప్పన్న, ఆర్‌ఐ ఎన్‌. బాబూరావు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 

Updated Date - 2022-09-29T04:21:58+05:30 IST