ఇదెక్కడి న్యాయం?
ABN , First Publish Date - 2022-06-08T05:17:37+05:30 IST
ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే, ఈ బదిలీల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇప్పటికే బలవంతంగా తమను కొత్త జిల్లాలకు పంపేశారని కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి
పాత జిల్లాల్లోని సిబ్బందికే బదిలీలు
కొత్త జిల్లాల్లోని వారికి చాన్స్ లేదు
కొంతమంది ఉద్యోగుల ఆవేదన
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్ 7: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే, ఈ బదిలీల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇప్పటికే బలవంతంగా తమను కొత్త జిల్లాలకు పంపేశారని కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి ఈనెల 17వ తేదీ వరకు బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, జిల్లాల పునర్విభ జనతో ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను ప్రభుత్వం కొత్త జిల్లాలకు బైఫోర్స్తో బదిలీ చేసింది. ఎటువంటి ఆప్షన్ లేకుండా వారిని రాత్రికి రాత్రే బదిలీ చేసింది. దీంతో జిల్లాకు చెందిన చాలామంది ఉద్యోగులు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వీరిలో ఎవరూ ఇష్టపూర్వ కంగా వెళ్లలేదు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో వీరికి ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 116లోని పేరా 7 ప్రకారం పాత జిల్లాల వారికే బదిలీలు వర్తిస్తాయని, ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా బదిలీల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉద్యోగాల మధ్య విభజనను సమష్టిగా వ్యతిరేకి ద్దామని, అందరికీ బదిలీలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.