రూ.54 కోట్లతో దేవస్థానం అభివృద్ధి

ABN , First Publish Date - 2022-02-20T04:57:44+05:30 IST

శ్రీముఖలింగేశ్వర దేవస్థానాన్ని రూ.54 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీముఖలింగం దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు.

రూ.54 కోట్లతో దేవస్థానం అభివృద్ధి
పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఏసీ శిరీష, చిత్రంలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

శ్రీముఖలింగం ఆలయ పాలక మండలి  ప్రమాణ స్వీకారం 

శ్రీముఖలింగం (జలుమూరు), ఫిబ్రవరి 19: శ్రీముఖలింగేశ్వర దేవస్థానాన్ని రూ.54 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. శ్రీముఖలింగం దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులు కృషి చేయాలన్నారు. భగవంతుడి సేవగా భావించి పనిచేయాలన్నారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీష సభ్యులతో ప్రమాణం చేయించారు. అంతకుముందు శ్రీముఖలింగేశ్వరుడ్ని డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ దర్శించుకున్నారు. ఆయన గోత్ర నామాలతో అర్చ కులు పూజలు చేయించారు. స్వామివారి శేషవస్త్రాలు అందించి దీవించారు. కార్యక్రమంలో పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య,  ఎంపీపీ వాన గోపి, సర్పంచ్‌ తమ్మన్నగారి సతీష్‌, ఎంపీటీసీ కరుకోల హరిప్రసాద్‌, నాయకులు తంగి మురళీకృష్ణ, ధర్మాన జగన్‌, ఆలయ ఈవో పి.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.


విరాళాల సేకరణకు ప్రత్యేక కౌంటర్‌

శ్రీముఖలింగేశ్వర ఆలయ అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవాలని.. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీష ఆదేశించారు. శనివారం మహా శివరాత్రి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విరాళాలు అందించే దాతలకు రసీదులు అందించాలన్నారు. ఉచిత, ప్రత్యేక దర్శనాలకు వచ్చే భక్తుల కోసం వేర్వేరు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.  ప్రాంగణంలో నీడ, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. 

 

Updated Date - 2022-02-20T04:57:44+05:30 IST