ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిక్కోలు
ABN , First Publish Date - 2022-09-18T05:15:12+05:30 IST
జిల్లా ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిక్కోలు ఆవిష్కృతం కానుందని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ‘ఒక్క అడుగు.. స్వచ్ఛ శ్రీకాకుళం వైపు’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.
కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
కలెక్టరేట్,
సెప్టెంబరు 17: జిల్లా ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిక్కోలు ఆవిష్కృతం
కానుందని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. శ్రీకాకుళం నగర పాలక
సంస్థ ఆధ్వర్యంలో శనివారం ‘ఒక్క అడుగు.. స్వచ్ఛ శ్రీకాకుళం వైపు’
కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని
ప్రారంభించారు. ఈ ర్యాలీ నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి గుడివీధి మీదుగా
నాగావళి రివర్ వ్యూ పార్క్ వరకు కొనసాగింది. కలెక్టర్తో పాటు నగర పాలక
సంస్థ కమిషనర్ ఓబులేశు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగావళి తీరంలో
చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరంలో మూడున్నర
లక్షల జనాభాకు 500 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారని తెలిపారు. వీరు
ప్రతిరోజూ వందల గృహాల నుంచి చెత్తను సేకరించడం సాధ్యపడే పని కాదన్నారు. అదే
ప్రజలు పారిశుధ్య కార్మికులకు తోడుగా నిలిస్తే చెత్త సేకరణ సాధ్యమవుతుందని
ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో కనిపించని చెత్త.. మన దేశంలోనే
ఉండడం సిగ్గుచేటుగా భావించాలన్నారు. దీనిపై మనకు మనమే ప్రశ్నించుకోవాలని
సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని
పిలుపునిచ్చారు. స్వచ్ఛ సిక్కోలు కోసం కృషి చేస్తానని ప్రతిఒక్కరూ సంతకాలు
చేయాలని కోరుతూ.. కలెక్టర్ తొలిసంతకం చేశారు. అనంతరం అధికారులతో కలిసి
ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు యార్లగడ్డ
గీతాశ్రీకాంత్, నటుకుల మోహన్, హారికా ప్రసాద్, ఎం.వెంకటస్వామి తదితరులు
పాల్గొన్నారు.