ఉపాధ్యాయుల బదిలీలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-12-13T23:58:13+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన ఉపాధ్యాయ పోస్టుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచే పనిలో నిమగ్నమయ్యారు.

ఉపాధ్యాయుల బదిలీలకు సిద్ధం

నేటి నుంచి వెబ్‌ఆప్షన్‌ నమోదు

ఖాళీల నిర్ధారణలో అధికారులు బిజీ

(నరసన్నపేట)

ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా ప్రాతిపాదికన ఉపాధ్యాయ పోస్టుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచే పనిలో నిమగ్నమయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను మంగళవారం సాయంత్రానికి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. కానీ, మారుమూల ప్రాంతాల్లో పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మండలాలకు దామాషా పద్ధతిలో పోస్టులు బ్లాక్‌ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఎంఈవోలు కుస్తీ పడుతున్నారు. ఇంకా ఖాళీల వివరాలు కొలిక్కి రాలేదు. బుధవారం ఖాళీలను ఆధికారంగా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సుమారు 15,300 మంది దరఖాస్తులు..

ఉమ్మడి జిల్లాప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సుమారు 15,300 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. బుధవారం నుంచి వెబ్‌ఆప్షన్‌ నమోదు ప్రారంభం కానుంది. ఈ నెల 17 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. నమోదు తరువాత వచ్చిన దరఖాస్తును ఉపాధ్యాయులు.. ఎంఈవోకు, సబ్జెక్టు టీచర్లు.. హెచ్‌ఎంలకు, హెచ్‌ఎంలు.. డిప్యూటీ డీఈవోలకు సమర్పించాలి. వీటిని వారు రెండు రోజులపాటు పరిశీలించిన తరువాత అర్హులకు వెబ్‌లో స్థానాలను కోరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రాజాం, పాలకొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్‌లు, భాషాపండితులు ఈ కౌన్సింలింగ్‌ ద్వారా జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమదాలవలస, పొందూరు, బూర్జ మండలాల నుంచి పాలకొండ డివిజన్‌లో పనిచేసేవారు అధికంగా ఉన్నారు. వీరిలో చాలామంది జిల్లాకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ ఖాళీలన్నింటిని ప్రకటించే పనిలో ఉన్నారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, టీచర్లు అడ్‌హాక్‌ పద్ధతిలో ఉద్యోగాలను పొంది తాత్కాలిక స్థానాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారి స్థానాలన్నీంటినీ ఖాళీలగానే పరిగణస్తారు.

దామాషా పద్ధతిలో పోస్టులు బ్లాక్‌

అన్ని పాఠశాలల్లో కనీస సంఖ్యలో టీచర్లు పనిచేసేలా పోస్టులు బ్లాక్‌ చేయాలని ప్రభత్వుం సూచించింది. బదిలీలకు అన్ని ఖాళీలు ప్రకటిస్తే మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా పోస్టులు బ్లాక్‌ చేయడం ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేలా ఖాళీలు ప్రకటించనున్నారు. అలాగే స్పౌజ్‌ పాయింట్లను ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాతే స్థానాలు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-13T23:58:15+05:30 IST