పెనసాం.. శోకసంద్రం

ABN , First Publish Date - 2022-12-05T00:05:31+05:30 IST

పెనసాం శోకసంద్రంగా మారింది. గ్రామానికి చెందిన భవానీ భక్తులు నల్లా ఈశ్వరరావు, రావి సంతోష్‌లు తుని వద్ద శనివారం ఉదయం కారు ఢీకొన్న ఘటనలో మృతిచెందిన సంగతి తెలిసిందే.

పెనసాం.. శోకసంద్రం
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

తుని నుంచి గ్రామానికి తీసుకువచ్చిన మృతదేహాలు

అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు

జి.సిగడాం, డిసెంబరు 4: పెనసాం శోకసంద్రంగా మారింది. గ్రామానికి చెందిన భవానీ భక్తులు నల్లా ఈశ్వరరావు, రావి సంతోష్‌లు తుని వద్ద శనివారం ఉదయం కారు ఢీకొన్న ఘటనలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అలుగోలు మహేశ్వరరావు, పున్నాన గిరిధర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈశ్వరరావు, సంతోష్‌ల మృతదేహాలు శనివారం అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్నాయి. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈశ్వరరావు మృతదేహం వద్ద భార్య నీలవేణి, పిల్లలు తులసీసాయి, భవాని, చరణ్‌, వృద్ధులైన తల్లిదండ్రులు అప్పారావు, ఈశ్వరమ్మ రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. తండ్రి మృతదేహాన్ని పట్టుకొని పిల్లలు రోదించిన తీరుచూసి అక్కడున్నవారు కన్నీరు ఆపుకోలేకపోయారు. సంతోష్‌ మృతదేహాన్ని చూసి భార్య సంధ్య కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు రామినాయుడు, నాగమణిలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈశ్వరరావు, సంతోష్‌ మృతదేహాలను కడసారి చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అశేష జనం నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-12-05T00:05:32+05:30 IST