కలెక్టరేట్‌లో కదలిక

ABN , First Publish Date - 2022-11-18T23:43:17+05:30 IST

డిప్యూటీ తహసీల్దార్‌ పదోన్నతి వ్యవహారంపై కలెక్టరేట్‌లో కదలిక వచ్చింది. పదోన్నతుల విషయంలో కలెక్టరేట్‌కు చెందిన కీలక విభాగాధికారి.. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జాబితా తయారు చేయడంతో తమకు అన్యాయం జరుగుతోందని గ్రామ రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు.

కలెక్టరేట్‌లో కదలిక

పదోన్నతుల పక్కదారిపై అధికారులు ఆరా

ఇద్దరు వ్యక్తుల హస్తం ఉన్నట్టు సమాచారం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

(కలెక్టరేట్‌)

డిప్యూటీ తహసీల్దార్‌ పదోన్నతి వ్యవహారంపై కలెక్టరేట్‌లో కదలిక వచ్చింది. పదోన్నతుల విషయంలో కలెక్టరేట్‌కు చెందిన కీలక విభాగాధికారి.. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జాబితా తయారు చేయడంతో తమకు అన్యాయం జరుగుతోందని గ్రామ రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ‘పదోన్నతుల్లో అన్యాయం’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 17న ప్రచురితమైన కథనంపై కలెక్టరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు స్పందించారు. ఈ విషయమై ఆరా తీస్తున్నారు. దీని వెనుక కలెక్టరేట్‌కు చెందిన ఓ కీలక విభాగ అధికారితో పాటు మరో కీలక ఉద్యోగి హస్తం ఉన్నట్టు సమాచారం. మంత్రి ప్రమేయంతో జాబితా పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్ల నియామక ప్రక్రియ ఫైల్‌ ముందుకు కదలడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా గుట్టుగా సాగిద్దామన్న పదోన్నతుల వ్యవహారం బయటపడడంతో.. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలోనని అధికారులు చర్చిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులను బదిలీ చేసి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

బెదిరింపులతో వెనుకంజ

జిల్లాలో సర్వే శాఖకు సంబంధించి 38 మంది డీటీలకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జీవో నెంబర్‌ 150 ప్రకారం 60 శాతం సీనియర్‌ అస్టెంట్‌లకు, 40 శాతం వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలి. జిల్లాలో మండలానికి ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్న చోట ఒకరినే ఉంచారు. మరొకరిని సర్వే శాఖకు డీటీగా తీసుకున్నారు. ఇలా 20 మందికి అవకాశం కల్పించారు. మిగిలిన 18 మందికి సంబంధించి.. 60ః40 విధానంలో 11 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు, ఏడు మంది గ్రామ రెవెన్యూ అధికారులకు పదోన్నతి కల్పించాలి. కాగా కలెక్టరేట్‌కు చెందిన కొందరు దిగువస్థాయి అధికారులు 14 పోస్టులు సీనియర్‌ అసిస్టెంట్లకు, నాలుగు పోస్టులకు వీఆర్వోలకు కేటాయించారు. ఈ జాబితాను ఉన్నతాధికారులకు అందజేశారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు జిల్లా వీఆర్వో సంఘం నాయకులు సన్నద్ధమయ్యారు. కాగా కలెక్టరేట్‌లోని కీలక విభాగ అధికారి, కీలక ఉద్యోగి వారిని బెదిరించడంతో.. ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

Updated Date - 2022-11-18T23:43:21+05:30 IST