ప్రమాదవశాత్తు జారిపడి..
ABN , First Publish Date - 2022-04-05T05:52:16+05:30 IST
ప్రమాదవశాత్తు జారిపడి..
- వంశధార లింక్ కెనాల్లో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
హిరమండలం : హిరమండలం వంశధార రిజర్వాయర్ కు సంబంధించి లింక్ కెనాల్లో ప్రమాదవశాత్తు జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం సంభవించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సుభలయి ఆర్ఆర్ కాలనీకి చెందిన పెండ్ర కృష్ణ(43) కూలి పనిచేసుకుని ఇంటికి వస్తూ... మార్గమధ్యలో ఉన్న వంశధార లింక్ కెనాల్లో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకు నేందుకు నీటిలో దిగేం దుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో కొట్టుకు పోయాడు. అతనితో పాటు వచ్చిన జి.మోసి, అప్పడు కాపేడేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పి.బుచ్చిబాబు ఎల్వీ రమణ అక్కడికి చేరుకొని వంధార ఎస్ఈ డి.తిరుమలరావుతో మాట్లాడి నీటి విడుదలను నిలుపుదల చేయించారు. ప్రవాహం పూర్తిగా తగ్గాక స్థానిక యువకులు కాలువలో దిగి కృష్ణ కోసం గాలించగా, కొంతదూరంలో మృతదేహాన్ని గుర్తించారు. కాగా కృష్ణ మృతితో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కృష్ణకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ కె.మధుసూదనరావు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.