నిర్లక్ష్యానికి... నిండు ప్రాణం బలి!
ABN , First Publish Date - 2022-01-24T05:27:43+05:30 IST
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ‘స్పీడ్బ్రేకర్’ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన పొందూరు మండలం నర్సాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగింది.
ద్విచక్ర వాహనంపై నుంచి తూలిపడి మహిళ దుర్మరణం
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన స్పీడ్బ్రేకరే కారణం
పొందూరు, జనవరి 23: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ‘స్పీడ్బ్రేకర్’ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన పొందూరు మండలం నర్సాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజాం మండలం రాజయ్యపేటకు చెందిన కోరాడ సత్యనారాయణ, సునీత (35) దంపతులు శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలోని బంధువుల ఇంటికి బైక్పై వెళుతున్నారు. సరిగ్గా నర్సాపురం అప్కో పరిశ్రమ ఎదురుగా ఉన్న స్పీడ్బ్రేకర్ వద్ద బైక్ ఎగిరిపడింది. వెనుక కూర్చున్న సునీత రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు గమనించి 108 వాహనాన్ని రప్పించగా.. అప్పటికే మృతి చెందింది. అప్పటివరకూ మాటలు చెప్పుకుంటూ వచ్చిన భార్య కళ్లేదుటే మృత్యు వాత పడడడంతో సత్యనారాయణ హృదయ విదారకంగా రోదించాడు. మృతురా లికి ఒక కుమార్తె ఉంది. సింగుపురంలో బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్తూ ఘటన చోటుచేసుకుంది. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిం చిన స్పీడ్ బ్రేకర్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సంబంధిత కంపెనీ ఎటువంటి అనుమతులు లేకుండానే భారీ స్పీడ్బ్రేకర్ ఏర్పాటుచేసినట్టు చెబుతున్నారు. దీంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పోలీసులు, అర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.