భర్త చనిపోయినా కనికరించలేదు!

ABN , First Publish Date - 2022-08-18T04:25:43+05:30 IST

భర్త మరణించి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నానని చెప్పినా వినలేదు. కాళ్లావేల్లా పడినా కనికరించలేదు. కార్యాలయం చుట్టూ తిరిగినా దయతలచలేదు. లంచం ఇవ్వనిదే పని జరగదని తేల్చిచెప్పాడు. దీంతో బాధిత మహిళ ఏసీబీని ఆశ్రయించింది. లంచం ఇస్తూ వీఆర్వోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించింది. కొత్తూరు మండలం పొన్నుటూరులో వెలుగుచూసిన ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు

భర్త చనిపోయినా కనికరించలేదు!
లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో సోమేశ్వరరావు

భూ బదలాయింపునకు రూ.30 వేలు డిమాండ్‌

ఏసీబీని ఆశ్రయించిన బాధిత మహిళ

వీఆర్వోకు రూ.15 వేలు లంచం ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన వైనం

పొన్నుటూరులో వెలుగుచూసిన ఘటన

కొత్తూరు, ఆగస్టు 17: భర్త మరణించి పిల్లలతో ఇబ్బందులు పడుతున్నానని చెప్పినా వినలేదు. కాళ్లావేల్లా పడినా కనికరించలేదు. కార్యాలయం చుట్టూ తిరిగినా దయతలచలేదు. లంచం ఇవ్వనిదే పని జరగదని తేల్చిచెప్పాడు. దీంతో బాధిత మహిళ ఏసీబీని ఆశ్రయించింది. లంచం ఇస్తూ వీఆర్వోను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించింది. కొత్తూరు మండలం పొన్నుటూరులో వెలుగుచూసిన ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొన్నుటూరు సచివాలయ భవనంలో బెవర శ్రీదేవి అనే మహిళ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో తొత్తడి సోమేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన బెవర కృష్ణారావు అనే రైతు కొద్ది నెలల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన పేరిట గ్రామంలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమి తన పేరిట మార్చాలని భార్య శ్రీదేవి వీఆర్వోకు దరఖాస్తు చేసుకుంది. అందుకు సంబంధించి అన్ని పత్రాలను పొందుపరచింది. అయితే ఎకరాకు రూ.10 వేలు వంతున రూ.30 వేలు ముట్టజెబితేనే పని జరుగుతుందని వీఆర్వో తేల్చిచెప్పాడు. ఇద్దరు పిల్లలతో ఇబ్బందిపడుతున్నానని చెప్పినా వీఆర్వో వినలేదు. లంచం ఇవ్వనిదే పని జరగదన్నాడు. చివరకు బాధితురాలు రూ.15 వేలు లంచం ఇవ్వడానికి ఒప్పుకుంది. అన్ని పత్రాలు ఉన్నా లంచం ఇవ్వడమేమిటని భావించింది. శ్రీకాకుళంలోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. డీఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేసింది. ఆయనిచ్చిన సలహా మేరకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల  సమయంలో కార్యాలయంలో ఉన్న వీఆర్వోకు రూ.15 వేల లంచం ఇచ్చింది. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తితో పాటు సిబ్బంది రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వీఆర్వో సోమేశ్వరరావును విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని కోరారు. దాడుల్లో ఏసీబీ సీఐ భాస్కరరావు, హరి, ఎస్‌ఐ సత్యరావు, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు




Updated Date - 2022-08-18T04:25:43+05:30 IST