గార దుర్గాలయంలో చోరీ
ABN , First Publish Date - 2022-10-15T04:13:35+05:30 IST
గార దుర్గాలయంలో చోరీ
- 4 తులాల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు అపహరణ
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం
గార, అక్టోబరు 14: గారలోని దుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. అమ్మవారికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం కొందరు భక్తులు, పూజారి.. దుర్గాదేవి ఆలయానికి వెళ్లారు. గుడి తలుపులు తెరిచి ఉండడంతో ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్త మార్పు ధర్మారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వచ్చి చూడగా అమ్మవారికి అలంకరించిన నాలుగు తులాల బంగారు, కేజీన్నర వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే శ్రీకాకుళం నుంచి క్రైమ్ ఏఎస్పీ విఠలేశ్వరరావు, క్లూస్టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగలు మండపంలో ఉన్న విద్యుత్ వైర్లను కట్ చేయడంతోపాటు సీసీ కెమెరా స్టోరేజీని కూడా తీసుకుపోయినట్లు గుర్తించారు. అలాగే హుండీని కూడా అపహరించి దాన్ని ఆలయం పక్కనే పడేశారు. ఆలయ ధర్మకర్త ధర్మారావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు.