గురువుగా మారి.. పాఠాలు చెప్పి

ABN , First Publish Date - 2022-04-25T04:26:00+05:30 IST

గురువుగా మారి.. పాఠాలు చెప్పి

గురువుగా మారి.. పాఠాలు చెప్పి

- ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో గడిపిన విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌

- కోర్టు ఆదేశాల మేరకు జిల్లాకు రాక

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 24: అక్కడి విద్యార్థులకు ఆయన గురువుగా మారి పాఠాలను బోధించారు. ఎవరెవరు ఎలా చదువుతున్నారన్నదీ స్వయంగా ఆరా తీశారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా... సాక్షాత్తు  పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ అధికారులను జిల్లాలకు వెళ్లి విద్యార్థులకు సేవ చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌కు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి విద్యార్థులకు సేవ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం ఆశ్రమ పాఠశాలకు చేరుకున్నారు. చాలాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి పరిస్థితులు, సౌకర్యాలను తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారో పరిశీలించారు. వారితో మాట్లాడుతూ.. చదువుపై ప్రత్యేక శ్రద్ధచూపాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించారు.  తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆయన గురువుగా మారి.. ఇంగ్లీషు పాఠం చెప్పారు. వారి విద్యాసామర్థ్యాలను పరిశీలించేందుకు పాఠాలను చదివించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. రాజీవ్‌ విద్యామిషన్‌ సమకూర్చిన అట్టలు, పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇంకా అవసరమైన సదుపాయాల గురించి ఆరాతీశారు. అనంతరం సాయంత్రం వెళ్లిపోయారు. ఆయన వెంట కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, డీఈవో పగడాలమ్మ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కమలమ్మ, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీనివాసరావు ఉన్నారు. 

Updated Date - 2022-04-25T04:26:00+05:30 IST