ఫీజు చెల్లిస్తే.. ఖాతా ఊడ్చేశారు

ABN , First Publish Date - 2022-09-09T04:04:41+05:30 IST

ఆన్‌లైన్‌లో ఓ కోర్సును నేర్చుకునేందుకు ఓ విద్యార్థి తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.200 ఫీజు చెల్లించాడు. ఆ వెంటనే ఆ ఖాతా నుంచి లక్ష రూపాయలకు పైగా నగదును సైబర్‌ నేరగాళ్లు ఊడ్చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ

ఫీజు చెల్లిస్తే.. ఖాతా ఊడ్చేశారు

వెలుగుచూసిన ఆన్‌లైన్‌ మోసం
 బ్యాంకు ఖాతా నుంచి రూ.1,04,820 గల్లంతు
కోటబొమ్మాళి, సెప్టెంబరు 8:
ఆన్‌లైన్‌లో ఓ కోర్సును నేర్చుకునేందుకు ఓ విద్యార్థి తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.200 ఫీజు చెల్లించాడు. ఆ వెంటనే ఆ ఖాతా నుంచి లక్ష రూపాయలకు పైగా నగదును సైబర్‌ నేరగాళ్లు ఊడ్చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కోటబొమ్మాళి మండలం సుబ్బారావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సుబ్బారావుపేట గ్రామానికి చెందిన ఆరవెల్లి ప్రదీప్‌ అనే విద్యార్థి పది రోజుల కిందట లటాడక్లబ్‌.కంలో మైక్రో కంట్రోలర్‌ కోర్సు నేర్చుకునేందుకు తన తండ్రి శ్రీనివాసరావు బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో రూ.200 ఫీజు చెల్లించాడు. అయితే, 15 నిమిషాల తరువాత విడతల వారీగా ఈ ఖాతా నుంచి రూ.1,04,820 నగదును సదరు కంపెనీ విత్‌డ్రా చేసింది. ఈ విషయాన్ని ప్రదీప్‌ తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించి గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్‌ఖాదర్‌ భాషా తెలిపారు. కాగా, ప్రదీప్‌ తండ్రి శ్రీనివానిరావు కొన్నేళ్ల కిందట హరిశ్చంద్రపురం నుంచి సుబ్బారావుపేట వచ్చేశాడు. అక్కడ వెంకటేశ్వర ఆలయంలో అర్చకుడిగా పని చేస్తూ అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. పిల్లల చదువు కోసం డబ్బులు దాచుకుంటే సైబర్‌ నేరగాళ్లు తమను దగా చేశారని లబోదిబోమంటున్నాడు.

Updated Date - 2022-09-09T04:04:41+05:30 IST