ఆంధ్ర రాష్ట్రానికి శనిలా దాపురించాడు!

ABN , First Publish Date - 2022-10-05T08:17:55+05:30 IST

ఆంధ్ర రాష్ట్రానికి శనిలా దాపురించాడు!

ఆంధ్ర రాష్ట్రానికి శనిలా దాపురించాడు!

జగన్‌ పాలనలో అభివృద్ధి శూన్యం: కాలవ

అనంతపురం అర్బన్‌, అక్టోబరు 4: జగన్‌ పాలనలో వెనుకబడిన ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్‌ శనిలా దాపురించాడన్నారు. రాయలసీమ ప్రజల కన్నీళ్లు, రైతుల వేదనలే జగన్‌ దద్దమ్మ పాలనకు నిదర్శనమని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  వైసీపీ పాలనలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా స్తభించిపోయిందని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం రూ.96,550 కోట్లు ఖర్చు చేసి, సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన జగన్‌, ఒక్క అడుగు కూడా అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద ప్రాజెక్టులను చేర్చడంతోనే సరిపెట్టారని విమర్శించారు. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు ఆపేశారని, కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండా మూడు రాజధానుల ముసుగులో వెనుకబడిన ప్రాంతాలకు సీఎం జగన్‌ అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధి కోసం 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో రూ.700 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసిందని, ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయో, ఏ పద్దులో ఖర్చు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతుంటే, మంత్రులు ఏం చేస్తున్నారని, ఇలాంటి పనికిమాలిన మంత్రి వర్గాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. 


Updated Date - 2022-10-05T08:17:55+05:30 IST