AP News: విజయవాడలో రెండో రోజు ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
ABN , First Publish Date - 2022-08-17T18:31:44+05:30 IST
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి.
విజయవాడ: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు ఉపాధ్యాయ సంఘాలు (Teachers unions) ఆందోళనకు దిగాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటూ రెండో రోజు సెల్డౌన్ కొనసాగించారు. ఉపాధ్యయ సంఘలకు మద్దతుగా ఆందోళనలో టీడీపీ నేత అశోక్ (Ashok) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని స్పష్టం చేశారు. తమ సెల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్నుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వ్యక్తిగత సమాచారం చోరీ కోసమే యాప్ డౌన్లోడ్పై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ‘‘మీ వ్యక్తిగత సమాచారం మాకెందుకు అంటూనే, మీరెక్కడెక్కడ తిరుగుతున్నారో మా వద్ద సమాచారం ఉందని అధికారులు బెదిరిస్తున్నారు’’ అని తెలిపారు. ప్రభుత్వం ఇదే తరహా ఒత్తిడి కొనసాగిస్తే సెల్ డౌన్తో పాటు యాప్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ డిమాండ్లు అంగీకరించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమన్నారు. జగన్మోహన్ రెడ్డి నూతన విధానం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.