Flood: శబరి, గోదావరి నదుల్లో పెరుగుతున్న నీటిమట్టం
ABN , First Publish Date - 2022-09-13T16:55:10+05:30 IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది.
రాజమండ్రి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరోసారి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains)తో శబరి (Shabari), గోదావరి (Godavari) నదులలో నీటిమట్టం పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో నాలుగోసారి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులు దాటింది. భద్రాచలం నుండి నెల్లిపాక మధ్యన జాతీయరహదారిపై వరదనీరు చేరడంతో రవాణా నిలిచిపోయింది. చింతూరు మండలంలో చూటూరు వద్ద రహదారిపైకి చీకటి వాగు చేరింది. ఈ క్రమంలో చింతూరు, వీఆర్పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు కుయుగూరు వద్ద వాగు పొంగడంతో ఒరిస్సావైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్వేపైకి వరద నీరు వచ్చి చేరడంతో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలిపాక వద్ద రహదారిపైకి గోదావరి వరద చేరడంతో... విలీన మండలాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి.