పెట్రో అమ్మకాలపై పరిమితి
ABN , First Publish Date - 2022-06-07T10:25:36+05:30 IST
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
గరిష్ఠం రూ.500 అంటూ బంకుల్లో బోర్డులు
ఆయిల్ కంపెనీల్లో స్టాక్ కొరతే కారణం?
ఏలూరుసిటీ, జూన్ 6: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆయిల్ కంపెనీల నుంచి డీజిల్ సరఫరా కష్టంగా ఉండటం వల్ల గరిష్ఠంగా 500 రూపాయల వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ పోస్తామని, వినియోగదారులు సహకరించాలనే బోర్డులు వెలుస్తున్నాయి. ఆయిల్ కంపెనీలలోనే స్టాకు లేకపోవడం వల్ల తాము సొమ్ములు ముందుగానే చెల్లించినా పెట్రోలు, డీజిల్ వచ్చే పరిస్థితులు కనిపించటం లేదని పెట్రోల్ బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 330 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజువారీ 4.50 లక్షల లీటర్ల పెట్రోల్, 8 లక్షల లీటర్ల వరకు డీజిల్ వినియోగం ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘నో స్టాక్’ బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.