నైరుతి తిరోగమనంలో ముంచెత్తుతున్న వర్షాలు

ABN , First Publish Date - 2022-10-11T09:25:38+05:30 IST

నైరుతి రుతుపవనాల తిరోగమన సమయంలో దేశాన్ని వర్షా లు ముంచెత్తుతున్నాయి. సెప్టెంబరు మూడో వారంలో

నైరుతి తిరోగమనంలో ముంచెత్తుతున్న వర్షాలు

మరికొద్ది రోజులు ఏపీకి తప్పని వాన


విశాఖపట్నం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల తిరోగమన సమయంలో దేశాన్ని వర్షా లు ముంచెత్తుతున్నాయి. సెప్టెంబరు మూడో వారంలో వాయువ్య భారతం నుంచి నైౖరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. అక్టోబరు తొలి వారంలో మఽధ్య భారతం వరకు నిష్క్రమణ పూర్తికావల్సి ఉన్నా... ఇంకా ఉత్తరాదిలో కొనసాగుతున్నాయి. సాధారణంగా అక్టోబరు తొలి వారంలో అల్పపీడనాలు ఏర్పడవు. అటువంటిది ఈ నెల తొలి వారంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడి ఐదో తేదీ వరకు కొనసాగింది. ఆ తరువాత తూర్పు మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి ఏపీ, తమిళనాడు తీరం దిశగా వచ్చాయి. దీనికితోడు ఆవర్తనాల నుంచి ఉత్తరాది వరకు ద్రోణులు కొనసాగడంతో సముద్రం నుంచి భారీగా వీస్తున్న తేమగాలుల ప్రభావంతో దక్షిణ భారతం నుంచి ఉత్తరాది వరకు వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ నైరుతి రుతుపవనాల సీజన్‌లో తూర్పు గాలులు వీచిన దాఖలాలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


ప్రస్తుతం శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఇంకా వచ్చే నాలుగైదు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడనున్నదని మోడల్స్‌ చెబుతున్నాయి. వీటి ప్రభావంతో మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా ప్రభావంతోనే సముద్రం నుంచి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయని అంచనా వేశారు. కాగా, రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2022-10-11T09:25:38+05:30 IST